Telangana Congress : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC)కి క్రమశిక్షణా కమిటీ సమర్పించిన నివేదిక రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. బీసీ సంక్షేమ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డిలను వారి పదవుల నుంచి తక్షణమే తప్పించాలని కమిటీ తన నివేదికలో స్పష్టంగా సిఫార్సు చేసినట్లు సమాచారం. వీరిద్దరి వైఖరి, వివాదాస్పద వ్యాఖ్యలు , శైలి వల్ల పార్టీకి మాత్రమే కాకుండా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ప్రజల్లో తీవ్ర చెడ్డపేరు వస్తోందని కమిటీ తన నివేదికలో కుండబద్దలు కొట్టింది. సీనియర్ నాయకులుగా ఉండి పార్టీ రహితమైన, వివాదాస్పద రీతిలో ప్రవర్తించడం వల్ల ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతింటోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
పదవుల నుంచి తొలగించాలని సిఫార్సు.. అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ
కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఐక్యతను కాపాడటానికి, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని క్రమశిక్షణా కమిటీ అభిప్రాయపడింది. అందుకే మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని, అలాగే చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించాలని సిఫార్సు చేస్తూ ఉన్నత స్థాయికి నివేదికను పంపినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన ఈ కీలక నివేదిక కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారగా, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ అధిష్టానం ఏ విధమైన కఠిన నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నెలకొంది.
అధిష్ఠానం వద్దకు నివేదిక.. చర్యలపై టీపీసీసీ స్పష్టత
ఇటీవల జరిగిన ఘటనలతో పాటు, గతంలో చోటుచేసుకున్న వరుస పరిణామాలను సమగ్రంగా విశ్లేషించి ఈ నివేదికలో పొందుపరిచామని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. “పార్టీలో క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడే నాయకులకు, అలాగే పార్టీకి తగిన గౌరవం దక్కుతుంది. ఆ గౌరవం దెబ్బతింటే అది అంతిమంగా పార్టీకే తీరని నష్టం కలిగిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. ఈ నివేదికను ప్రస్తుతం టీపీసీసీకి అందజేశామని, అక్కడి నుంచి ఏఐసీసీ (AICC) ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానానికి చేరుతుందని వెల్లడించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది పూర్తిగా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయమేనని మల్లు రవి స్పష్టం చేశారు. అధిష్ఠానం దీనిపై సమీక్షించి ఏ నిర్ణయం తీసుకున్నా, ఆ వివరాలను మీడియా ద్వారా వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

