హస్తిన పర్యటనలోఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్తో సమావేశం అయ్యారు… ఇవాళ సుమారు 40 నిముషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. అయితే, నెల రోజుల వ్యవధిలోనే షెకావత్తో కేసీఆర్ భేటీ కావడం ఇది రెండోసారి.. ఈ నెల 6న కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశమైన కేసీఆర్.. 5 అంశాలపై విజ్ఞానపత్రం అందజేశారు.. ఇక, ఇవాళ్టి సమావేశంలోనూ గత సమావేశంలో చర్చించిన అంశాలే మరలా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది..
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో తెలంగాణ ఏర్పడక ముందే ప్రారంభించిన 11 ప్రాజెక్టులను కేంద్రం జారీ చేసిన గెజిటి నోటిఫికేషన్ లో అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొన్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.. రాష్ట్రానికి కేటాయించిన 967.94 టీఎంసీల నీటి పరిధిలోనే ప్రొజెక్టులు ఉన్నాయని, అందులో 758.76 టీఎంసీల వినియోగానికి సంబంధించిన ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం ఇప్పటికే అనుమతులు ఇచ్చిందని గుర్తుచేశారు. మరో 148.82 టీఎంసీల సంబంధించి నీటి లభ్యతపై హైడ్రోలజీ డైరెక్టరేట్ అనుమతులు మంజూరు చేసిందని లేఖలో పేర్కొన్న సీఎం.. చిన్న నీటి పారుదల పథకమైన కందుకుర్తి ఎత్తిపోతల పథకం 3300 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందిస్తుందని..దీనికి అనుమతులు అవసరం లేదన్నారు. రామప్ప పాకాల లింక్, తుపాకులగూడెం బ్యారేజ్, దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగం కాబట్టి కొత్తగా అనుమతి అవసరం లేదని.. కంతనపల్లి ప్రాజెక్టును కూడా అనుమతి లేని ప్రాజెక్టుల జాబితా నుంచి తీసివేయాలని కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ దృష్టికి తీసుకెళ్లారు సీఎం కేసీఆర్.