సింగరేణి కార్మికులకు గుడ్న్యూస్ చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు.. సింగరేణి ఉద్యోగులు, కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచాలని నిర్ణయించారు.. ఈ మేరకు ఈనెల 26 తేదీన జరిగే బోర్డు మీటింగ్లో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్ను ఆదేశించారు.. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43,899 మంది సింగరేణి కార్మికులు, అధికారులకు లబ్ధి చేకూరనున్నది. ఇక, రామగుండం నియోజకవర్గ కేంద్రంలో సింగరేణి మెడికల్ కాలేజీ ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి. సింగరేణి ప్రాంత సమస్యలు- పరిష్కారాలు అంశంపై ఆ ప్రాంత పరిధిలోని ప్రజా ప్రతినిధులతో ప్రగతి భవన్ లో మంగళవారం సీఎం కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.