Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం

  • ఈనెల 21న మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ
  • శాఖలకు సీఎస్ కీలక ఆదేశాలు జారీ
  • ఎజెండా అంశాలు మంగళవారం సాయంత్రంలోగా సమర్పించాలి
  • అధికారులు హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశం
Telangana Cabinet Meeting

Telangana Cabinet Meeting

తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి (కేబినెట్) సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీన (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని సమావేశ మందిరంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు , కార్యదర్శులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమావేశంలో చర్చించాల్సిన ఎజెండా అంశాలను, వాటి పక్కా తెలుగు అనువాదంతో కలిపి మంగళవారం సాయంత్రం 6 గంటల లోపు తప్పనిసరిగా సాధారణ పరిపాలన (కేబినెట్) శాఖకు పంపాలని సీఎస్ స్పష్టం చేశారు. ఒకవేళ ఏ శాఖకైనా కేబినెట్ చర్చ పరిధిలోకి వచ్చే ఎజెండా అంశాలు లేకపోయినా.. ఆ వివరాలతో కూడిన ‘నిల్’ (NIL) నివేదికను కూడా నిర్దేశిత గడువులోగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, కేబినెట్ సమావేశం జరిగే సమయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు , ప్రభుత్వ కార్యదర్శులందరూ ఏ ఒక్కరూ సెలవు పెట్టకుండా తప్పనిసరిగా హెడ్‌క్వార్టర్స్ (కార్యాలయాల) లోనే అందుబాటులో ఉండాలని సీఎస్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు కీలక నిర్ణయాలు, తాజా రాజకీయ, పరిపాలనాపరమైన అంశాలపై ఈ కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది.