NTV Specials : రాజన్న.. ఈ ‘వీఆర్ఏ’ పరిస్థితి ఎందన్న..
పేదల దైవంగా.. కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల దేవుడు శ్రీరాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలోనే ఓ అవమానీయ ఘటన వెలుగులోకి వచ్చింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా. రెవెన్యూ విభాగంలో వీఆర్ఏగా పనిచేస్తున్న ప్రశాంత్ అధికారుల ఆదేశాలతో ప్రతిరోజు ఉదయం వేములవాడలోని ఆర్డీవో కార్యాలయాన్ని శుభ్రం చేసి తిరిగి తన విధులకు వెళ్తున్నాడు. వేములవాడలో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేసి దాదాపు 10 నెలలు గడుస్తున్నా సిబ్బందిని నియమించక పోవడంతో అరకొర వసతులతో నడుస్తోంది. కనీసం కార్యాలయంలో అటెండర్ లేకపోవడంతో ఆఫీసును శుభ్రం చేసేవారు కరువయ్యారు. దీంతో గత నెల రోజులుగా బోయిన్పల్లి మండల కేంద్రంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ ను ప్రతిరోజు కార్యాలయాన్ని శుభ్రం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. చేసేదేమి లేక ఉదయాన్నే వేములవాడ చేరుకొని కార్యాలయాన్ని శుభ్రం చేస్తున్నాడు. అనంతరం విధులకు హజరవుతున్నాడు. వెంటనే వేములవాడ ఆర్డీవో కార్యాలయంలో సిబ్బందిని నియమించి వీఆర్ఏకు మోక్షం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.