Sircilla Paddy Scam: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జరిగిన ఒక భారీ కుంభకోణాన్ని జిల్లా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నకిలీ రికార్డులతో ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్న ఒక అంతర్ జిల్లా ముఠా గుట్టును రట్టు చేసి, అందులోని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మీడియాకు వెల్లడించారు.
రూ. 91 లక్షల ప్రభుత్వ నిధుల మాయం
నిందితులు నకిలీ ట్రక్ షీట్లను సృష్టించి, వాటిని సివిల్ సప్లైస్ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ విధంగా తప్పుడు రికార్డులను చూపిస్తూ సుమారు రూ. 91 లక్షల ప్రభుత్వ సొమ్మును కాజేశారు. అంతేకాకుండా, కొనుగోలు కేంద్రాల నుండి గోదాంకు వచ్చిన ధాన్యాన్ని కేవలం రికార్డుల్లో మాత్రమే చూపిస్తూ, వాస్తవానికి ఆ ధాన్యాన్ని ప్రైవేట్ రైస్ మిల్లులకు అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకున్నారు.
ప్రధాన సూత్రధారులు , నిందితుల అరెస్ట్
ఈ భారీ స్కామ్లో పెద్దూర్ అపెరల్ పార్క్ గోదాం మేనేజర్ ఉత్కం విజయ్, అలాగే సూపర్వైజర్ వాసాల గణేష్ ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరితో పాటు ఈ అంతర్ జిల్లా ముఠాకు చెందిన మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
నగదు స్వాధీనం.. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్
నిందితుల నుండి పోలీసులు రూ. 14 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారి వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 46 లక్షల నిధులను ఏజెన్సీలు ఫ్రీజ్ చేశాయి. మిగిలిన రికవరీ కోసం , అక్రమ ఆస్తుల వివరాల కోసం పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
సివిల్ సప్లై మేనేజర్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కుంభకోణం వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో, అలాగే రైస్ మిల్లుల యజమానుల పాత్రపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే స్పష్టం చేశారు.

