Bhadrachalam: శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 17న భద్రాచలంలో రామయ్య కల్యాణోత్సవం జరగనుంది. ఈ వేడుకకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రామయ్య, సీతమ్మ దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. స్వామి, అమ్మవార్లకు విలువైన కానుకలు సమర్పిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ సీతమ్మవారికి అరుదైన చీరను తయారు చేశారు. చీర ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు, 600 గ్రాముల బరువు ఉంటుంది. బంగారం, వెండి, ఎరుపు రంగులతో దీన్ని రూపొందించడానికి 18 రోజులు పట్టిందని విజయ్ తెలిపారు. దీనికి గాను రూ.48 వేలు ఖర్చయిందని.. ఈ నెల 16న చీరను భద్రాచలం సీతమ్మకు కానుకగా అందించనున్నట్లు వెల్లడించారు.
Read also: KTR: నేడు ఆదిలాబాద్లో కేటీఆర్ పర్యటన.. బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరు
ఇక సీతారాముల కల్యాణానికి సిరిసిల్ల నుంచి సీతమ్మకు పెళ్లి చీర వెళ్తుంది. చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ప్రతి సంవత్సరం పెళ్లికి చీర పంపడం ఆనవాయితీ. ఈసారి తన చేనేత నైపుణ్యాన్ని ఉపయోగించి మగ్గంపై సీతారాముల కళ్యాణం జరిగేలా చీరను నేసాడు, చీర అంచుల్లో భద్రాద్రి దేవాయణంలోని సీతారాముల ప్రతిరూపాలు ఉన్నాయి. చీర అంతా శంకు, చక్ర నామాలతో పాటు బోర్డర్లో జైశ్రీమ్ అనే అక్షరాలు కనిపించేలా చీరను తయారు చేశాడు. ఆరు రోజుల పాటు కష్టపడి ఈ చీరను తయారు చేసినట్లు హరిప్రసాద్ వెల్లడించారు. 800 గ్రాముల బరువున్న ఈ చీరలో రెండు గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి పట్టు దారాలను ఉపయోగించారు. ఈ చీరలో సీతారాముల కళ్యాణ చిత్రం నేయడం విశేషం. ఈ చీరను ఇవాళ ధార్మిక శాఖ మంత్రి కొండా సురేఖకు చూపించి భద్రాద్రి దేవస్థానానికి అందజేస్తానని హరిప్రసాద్ తెలిపారు.
Gold Price Today : పరుగులు పెడుతున్న పుత్తడి ధరలు.. అదే దారిలో వెండి.. ఎంతంటే?