తెలంగాణలో తెలుగు అకాడమీ కేసు తరహాలో మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ గిడ్డంగుల శాఖలో భారీగా ఫిక్సుడ్ డిపాజిట్ నిధులు మాయం అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల శాఖకు చెందిన రూ.4 కోట్ల నిధులు గల్లంతు అయ్యాయని తెలుస్తోంది. తప్పుడు ఎఫ్డీ పత్రాలు చూపించి కార్వాన్ యూనియన్ బ్యాంక్ నుంచి ఫిక్సుడ్ డిపాజిట్ నిధులను కొల్లగొట్టారని పోలీసులకు ఫిర్యాదు అందింది.
గిడ్డంగుల శాఖ అధికారుల ఫిర్యాదుతో ఈ స్కాంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా తెలుగు అకాడమీ కేసు ముఠా పనేనని అనుమానిస్తున్నారు. అంతేకాదు.. బ్యాంకు అధికారుల పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీఎస్లో గిడ్డంగుల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ దర్యాప్తును వేగ వంతం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు.