ప్రధాని మోడీ ఇటీవల పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ప్రధాని హైదరాబాద్కు వచ్చినపుడు ముఖ్యమంత్రి కేసీఆర్కి జ్వరం ఉందని వెళ్లకపోతే అది మనసులో పెట్టుకుని తెలంగాణపై విషం కక్కుతున్నారని అన్నారు. ప్రతి తెలంగాణ బిడ్డ దీనిని తీవ్ర పరిణామంగా తీసుకుని నిరసన తెలపాలని, కేసిఆర్ ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారని, కేసీఆర్ వల్ల తనకు, తన పదవికి ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని భావించి, తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడి విషం చిమ్ముతున్నారని ఆమె మండిపడ్డారు.
పార్లమెంట్ తలపులు వేసి రాష్ట్రం ఇచ్చారని అడ్డగోలుగా మాట్లాడితే మరి ఆరోజు మీ నాయకులు కళ్ళు మూసుకుని మద్దతు ఇచ్చారా? ప్రధాని చెప్పాలి.. అని ఆమె ప్రశ్నించారు. మీ ఒక్కరికే రాజ్యాంగం తెలిసినట్లు, తెలివి ఉన్నట్లు మాట్లాడొద్దని ఆమె చురకలు అంటించారు. కాంగ్రెస్ పార్టీ మీద కోపాన్ని వెళ్ళబుచ్చే క్రమంలో తెలంగాణ ప్రజలపై అక్కసు వెళ్ళబుచ్చడం సరైన పద్దతి కాదని తెలుసుకోవాలని, తెలంగాణ ప్రజలు, జాతికి ఈ ప్రధాని క్షమాపణలు చెప్పాలిని ఆమె డిమాండ్ చేశారు. మూర్ఖ వ్యక్తి ప్రధాని కావడం దేశ ప్రజల దురదృష్టమని ఆయన అన్నారు.