ధాన్యం కొనుగోలు పై రాష్ట్ర రైతాంగం కొద్ది రోజులుగా పడుతున్న ఆందోళనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారని రాష్ట్ర గిరిజన, స్త్రీ-,శిశు.. సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. యాసంగిలో ధాన్యం సేకరణపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. యాసంగి లో తెలంగాణలో బాయిల్డ్ రైస్ కొనమని కేంద్రం షరతులు పెట్టి చేతులు ఎత్తివేయడంతో… సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పండిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుందని, కనీస మద్దతు క్వింటాలు కు 1960 రూపాయల ధర ఇస్తుందని నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తున్నానని, సీఎం కేసీఆర్ రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
ఈ పరిస్థితి ముందే ఊహించి యాసంగిలో తక్కువ వరి వేయాలని సీఎం కేసీఆర్ రైతులను కోరిన మేరకు ఈసారి 36 లక్షల ఎకరాల్లో వరి వేశారని, 20 లక్షల ఎకరాల్లో తక్కువ వరి వేశారని,ఈ సీజన్ లో ఎంత అమ్మకానికి వస్తుందో అంచనా వేసి ఆ ధాన్యం సేకరణకు తగిన ఏర్పాట్లు చేసి, రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. గత అనుభవాల నేపథ్యంలో ఈసారి ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలని, రైస్ మిల్లర్లు కూడా రైతులకు సంపూర్ణంగా సహకరించాలన్నారు. రైతులను బ్లాక్ మెయిల్ చేయడం, ఆలస్యం చేయడం, ఇబ్బంది పెట్టడం మంచిది కాదని, ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకుంటే… ఆ విధంగా ధాన్యం రైస్ మిల్లర్లు తీసుకోవాలన్నారు.
రైతు 6 నెలల కష్టం చాలా విలువైంది. కాబట్టి కొనుగోలు విషయంలో అందరూ కలిసి ఉమ్మడి బాధ్యతగా పని చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరించిన వెంటనే డబ్బులు వస్తాయని సీఎం కేసిఆర్ హామీ ఇచ్చారు. దీని గైడ్ లైన్స్ వెంటనే వస్తాయని, రైస్ మిల్లర్లతో కూడా సమావేశం నిర్వహించి వారితో చర్చిస్తామని ఆమె అన్నారు. ఈ సమావేశానికి కలెక్టర్ శశాంక, జెడ్పీ చైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా అధికారులు హాజరయ్యారు.