CM Revanth Reddy: గౌడన్నలకు సీఎం రేవంత్‌ బిగ్‌ హామీ.. గీత కార్మికుల కోసం కీలక ప్రకటనలు

  • ట్యాంక్‌బండ్‌పై సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహం..
  • ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ వీరుడు, సామాజిక ఉద్యమకారుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ 376వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప యోధుడని కొనియాడారు. అమరవీరుల స్థూపానికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో పాపన్న విగ్రహానికి కూడా అంతే ప్రాధాన్యం ఉండాలని అన్నారు. బీసీ నేతల విజ్ఞప్తి మేరకు నెక్లెస్‌ రోడ్డుపై పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

గీత కార్మికులకు అండగా ఉంటాం..

గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని రేవంత్‌రెడ్డి తెలిపారు. అర్హత ఉన్న గీత కార్మికులకు పెన్షన్లు అందించేలా ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ఇరిగేషన్‌ కాల్వలపై ఈత, తాటి చెట్లను పెంచే చర్యలు చేపడతామని వెల్లడించారు. అలాగే గౌడ సామాజికవర్గం సహకారంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ మరోసారి అధికారంలోకి వస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో కలిసి పనిచేస్తున్నామని, తమ కాంబినేషన్‌లో 2029లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇందిరమ్మ పాలనలో తెలంగాణ బహుజనుల తెలంగాణగా మారుతుందని సీఎం అన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సర్వాయి పాపన్న ఆలోచనలకు అనుగుణంగా పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, సన్నబియ్యం వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. గత పదేళ్ల పాలనపై సీఎం తీవ్ర విమర్శలు చేశారు. గత పాలకులు కులవృత్తులు చేసుకోవాలని చెప్పారని, తమ ప్రభుత్వం మాత్రం సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. “కేసీఆర్‌ది ఫ్యామిలీ జస్టిస్‌ అయితే.. మాది సోషల్‌ జస్టిస్‌” అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 117 సీట్లు వస్తాయని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలదేనని, మరోసారి పాత పాలనకు వెళ్లకుండా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం కుటుంబంలా పనిచేస్తోందని, ఏ సమస్య ఉన్నా చర్చించి పరిష్కరించుకునే విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్‌ నాయకులతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.