Rythu Bharosa: తెలంగాణలోని రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన తీపి కబురు అందించింది. అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ నిధుల విడుదలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. కేబినెట్ ఆమోదించిన షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 30వ తేదీన అర్హులైన రైతులందరి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఈ రైతు భరోసా నిధులను జమ చేయనున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే ఈ నిధులు విడుదల కానుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిధుల విడుదల కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభ వేదిక నుంచే ముఖ్యమంత్రి నేరుగా రైతుల అకౌంట్లలోకి డబ్బులను జమ చేసే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించనున్నారు.

