కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రాజెక్టుల రీ-డిజైన్ పేరుతో తెలంగాణలో భారీ అవినీతి జరిగిందని, కమీషన్ల కోసమే ప్రాజెక్టుల పేర్లు, స్థలాలు మార్చారని ఆయన ఆరోపించారు.
2009లోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని సీఎం గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు పేరు రాకూడదనే ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రభుత్వం వాటి స్థలాలను, పేర్లను మార్చిందని మండిపడ్డారు. కేవలం ఆర్థిక లాభాలు, కమీషన్ల కోసమే ఈ రీ-డిజైన్ డ్రామా ఆడారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జరిగిన ప్రచారాన్ని ఎద్దేవా చేస్తూ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భుతమని ప్రచారం చేసుకున్నారు. రాజకీయ లబ్ధి పొందేందుకు అప్పటి గవర్నర్ నరసింహన్ తో హరీష్ రావు పేరును మార్చి ‘కాళేశ్వర్ రావు’ అని చెప్పించారు” అంటూ దుయ్యబట్టారు. ప్రాజెక్టు గొప్పతనం కంటే వ్యక్తిగత ఇమేజ్ కోసమే అప్పట్లో ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.
కేసీఆర్ చేసిన అవినీతిని కాలమే గుర్తించిందని, అందుకే 2023 ఎన్నికల ముందే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని సీఎం పేర్కొన్నారు. “కేసీఆర్ పాపాలను ప్రకృతే బయటకు తీసింది. ప్రపంచ అద్భుతం అని చెప్పిన ప్రాజెక్టు గాలిలో కలిసిపోయింది” అని అన్నారు.
Inter Exam Fee: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు చెల్లింపు గడువు పెంపు..
కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని కోణాల్లోనూ విఫలమైందని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) తన నివేదికలో స్పష్టంగా పేర్కొందని సీఎం వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణం, నాణ్యత, ప్లానింగ్.. ఇలా ప్రతి విషయంలోనూ వైఫల్యాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ పర్యటనలో ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మంత్రులు, ఉన్నతాధికారులు , భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
