రాష్ట్ర ఖజానాకు గండి కొడుతూ సాగే అక్రమ మైనింగ్ వ్యవహారాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ గండి పడినా, ఖనిజ సంపద దోపిడీకి గురైనా తాము చూస్తూ ఊరుకోబోమని, అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అంశంపై ముఖ్యమంత్రి సాక్ష్యాధారాలతో సమాధానమిస్తూ, ఇప్పటికే ఆ సంస్థకు నోటీసులు జారీ చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
Akhil Raj: “రాజు వెడ్స్ రాంబాయి” హీరో ఇల్లు ఎలా ఉందో చూశారా?
ప్రభుత్వ ఆదేశాల మేరకు మైనింగ్ శాఖ జరిపిన విచారణలో భాగంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి భారీ మొత్తంలో పన్నులు వసూలు చేసినట్లు ముఖ్యమంత్రి వివరించారు. సినరేజ్ ఛార్జీల కింద రూ. 1,52,97,825, అలాగే పర్మిట్ ఫీజు కింద రూ. 22,25,446 మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఆ సంస్థ నుండి కట్టించుకుందని ఆయన సభకు తెలిపారు. ఎవరైనా మంత్రుల పేర్లు చెప్పుకుని లేదా రాజకీయ పలుకుబడితో పన్నులు ఎగ్గొట్టాలని చూస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఖజానాకు రావాల్సిన ప్రతి పైసాను వసూలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అక్రమ మైనింగ్కు అడ్డుకట్ట వేయడంలో రాజీ పడేది లేదని ఈ సందర్భంగా ఆయన తేల్చి చెప్పారు.
