Revanth Reddy Distributed Rajeev Gandhi Bima Checks: గాంధీ భవన్లో రాజీవ్ గాంధీ ప్రమాద బీమా లబ్దిదారులకు టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చుక్కులను పంపిణీ చేశారు. తొమ్మిది మందికి చెక్కులను పంపిణీ చేయగా.. మిగతావారికి ఇంటి వద్దకే చెక్కులను పంపనున్నట్టు ధృవీకరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 90 రోజుల్లో 45 లక్షల సభ్యత్వాలను నమోదు చేయించిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. 45 లక్షల సభ్యులకు రూ.2 లక్షల రాజీవ్ గాంధీ ప్రమాద బీమా కల్పిస్తున్నామని అన్నారు.
ఇప్పటివరకు 427 మంది సభ్యులు చనిపోయారని, వారికి ప్రమాద బీమా అందిస్తున్నామని స్పష్టం చేశారు. 129 మంది ప్రమాద బీమాకు సంబంధించి ధ్రువపత్రాలు సమర్పించారని.. ధ్రువపత్రాలు సమర్పించనివారు వీలైనంత త్వరగా ఆ ప్రాసెస్ పూర్తి చేయాలని కోరారు. ఇదే సమయంలో.. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని అన్నారు. అలాగే.. తెలంగాణ రాష్ట్ర పతాకం, తెలంగాణ జాతి గీతం, గాంధీ భవన్లో జెండా ఆవిష్కరణలు ఉంటాయని చెప్పారు. టీఎస్(TS) స్థానంలో టీజీ(TG) మార్పుకి అప్పీల్ చేస్తామని వెల్లడించారు.