మహా నగరం హైదరాబాద్ విస్తరిస్తూనే ఉంది… ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో భారీ స్థాయిలో కొత్త వెంచర్లు వస్తూనే ఉన్నాయి.. ప్లాట్లు, ఇళ్లు ఇలా రెగ్యులర్గా క్రయ విక్రయాలు సాగుతూనే ఉన్నాయి.. ప్రతిష్టాత్మక సంస్థలు రంగంలోకి దిగి విల్లాలు, అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్లు.. ఇలా అనేక రకాలుగా బిజినెస్ చేస్తున్నాయి.. కొన్ని చోట్ల ఇప్పటికే ఓఆర్ఆర్ను దాటేసి రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతోంది… రీజనల్ రింగ్ రోడ్డు కూడా రానుండడంతో.. దానిని దృష్టిలో పెట్టుకుని కూడా బిజినెస్ జరుగుతోంది. ఇక, మరోసారి రియల్ ఎస్టేట్ రంగంలో తనకు తిరుగులేదని నిరూపించుకుంది హైదరాబాద్… 2021 ఏడాదిలోనూ రియల్ కింగ్గా నిలిచింది… ఓవైపు కరోనా మహమ్మారి కష్టాలు చుట్టుముట్టినా… రియల్ ఎస్టేట్ రంగం భాగ్యనగరంలో జోరు మీదే ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి… 2021 ఏడాదికి సంబంధించి దేశంలోనే ఎక్కువ ఇళ్లు అమ్ముడైన మెట్రో సిటీగా మొదటి స్థానంలో నిలిచి సత్తా చాటింది హైదరాబాద్..
ఏడాది చివరన డిసెంబర్ నెలలో అమ్ముడైన ఇళ్ల యూనిట్ల సంఖ్యలో తగ్గుదల కనిపించినా.. రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో తగ్గేదేలే అనిపించింది. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్ నగర పరిధిలో 3,931 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి.. ఈ రిజిస్ట్రేషన్ విలువ ఏకంగా రూ.2,340 కోట్లుగా నిలిచింది. గతేడాది ఇదే నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో పోల్చితే 16 శాతం వృద్ధి కనిపించింది. డిసెంబర్లో అమ్ముడైన ఇళ్లలో అత్యధికం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నాయి. మహా నగర అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించిన ప్రభుత్వం.. శివారు ప్రాంతాల్లోనూ అభివృద్ధికి భారీగా ఖర్చు చేస్తోంది.. కొత్తగా ఏర్పాటైన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో జోరుగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.. ఇవి కూడా రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇస్తున్నాయి.