TGIIC Auction : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఆల్‌టైమ్ రికార్డు..!

  • హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త రికార్డు
  • ఐటీ హబ్ సమీప భూములకు భారీ డిమాండ్
  • గత ఏడాది రేటును దాటేసిన వేలం ధర
  • రాయదుర్గం ప్రాంతంపై రియల్ ఎస్టేట్ దిగ్గజాల ఫోకస్
Hyderabad

Hyderabad

TGIIC Auction : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఐటీ హబ్‌కు అత్యంత సమీపంలో ఉన్న రాయదుర్గం పాన్ మక్తా ప్రాంతంలో తెలంగాణ గ్లోబల్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన భూముల వేలంలో కళ్లు చెదిరే ధర నమోదైంది. ఇక్కడ ఒక ఎకరం భూమి ధర ఏకంగా రూ.237 కోట్లకు చేరుకోవడం సంచలనంగా మారింది.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల పరిధిలోని సర్వే నంబర్ 83/1 లో ఉన్న 6 ఎకరాల 29 గుంటల ప్రభుత్వ భూమికి టీజీఐఐసీ ఈ-వేలం నిర్వహిస్తోంది. ఈ వేలం ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగానే భూమి ధరలు భారీ స్థాయికి చేరాయి. ఐటీ కంపెనీలు, కమర్షియల్ ప్రాజెక్టులకు అత్యంత అనుకూల ప్రాంతంగా పేరుగాంచిన రాయదుర్గంలో స్థలాల కోసం రియల్ ఎస్టేట్ సంస్థలు తీవ్ర పోటీ పడుతున్నాయి.

×
×
Ad

గత ఏడాది ఇదే ప్రాంతంలో ఎకరం భూమి గరిష్టంగా రూ.177 కోట్లకు అమ్ముడవగా, ఈసారి ఆ రికార్డు పూర్తిగా బద్దలైంది. ప్రస్తుతం నమోదైన రూ.237 కోట్ల ధరతో గత రికార్డుపై మరో రూ.60 కోట్ల పెరుగుదల కనిపించడం విశేషం. దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో భూముల డిమాండ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి స్పష్టమైంది.

ఐటీ కారిడార్ విస్తరణ, మెట్రో కనెక్టివిటీ, కమర్షియల్ అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కారణంగా రాయదుర్గం ప్రాంతం రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌గా మారింది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో భూముల ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.