Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో మహా శివరాత్రి జాతర ప్రారంభమైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు జాతర కొనసాగనుంది. రేపు మహా శివరాత్రి ఉత్సవాలకు దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేములవాడ మహాశివరాత్రి వేడుకల కోసం రాజన్న ఆలయాన్ని పునరుద్ధరించారు. వేడుకలకు మన రాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి దాదాపు 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో మంత్రి కేటీఆర్ ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు. కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఈఓ కృష్ణ ప్రసాద్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సుమారు రూ.3.03 కోట్లతో పనులు జరుగుతున్నాయి. 400 వసతి గదులు మాత్రమే ఉండడంతో గుడిచెరువు నేలంతా పందిళ్లతో నిండిపోయింది. తాగునీటి వసతితో పాటు స్నాన ఘాట్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. రాత్రి జాగరణ చేసే భక్తులకు శివార్చన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Read also: Etela Rajender: జైలు నుండి విడుదలైన కమలాపూర్ బీజేపీ నాయకులు.. ఈటెల ఘన స్వాగతం
ఇందుకోసం దేశం నలుమూలల నుంచి కళాకారులు తరలివచ్చారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఇతర జిల్లాలకు చెందిన మున్సిపల్ కార్మికులు, తాత్కాలిక కార్మికులు ఆలయ సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నారు. నేటి (శుక్రవారం) నుంచి మూడు రోజుల పాటు జరిగే జాతరకు వచ్చే భక్తుల కోసం 4 లక్షల లడ్డూలు, 10 క్వింటాళ్ల పులిహారను అధికారులు సిద్ధం చేస్తున్నారు. 100 గ్రాముల లడ్డూలు, 250 గ్రాముల పులిహార ప్యాకెట్లు ఉంటాయి. 100 గ్రాముల లడ్డూ రూ.20, 500 గ్రాముల లడ్డూ రూ.100, పులిహార రూ. 15కి విక్రయిస్తారు. ప్రసాదం కౌంటర్లలోనే కాకుండా నిష్క్రమణ మార్గాల్లో కూడా అందుబాటులో ఉంచబడుతుంది. భక్తులకు వైద్య సహాయం అందించేందుకు 11 ఎమర్జెన్సీ సెంటర్లు, 163 మంది వైద్య సిబ్బందిని నియమించినట్లు డీఎంహెచ్ఓ డా. సుమన్ మోహన్ రావు అన్నారు. జాతర జరిగే ప్రాంతాలైన తిప్పాపూర్, జగిత్యాల బస్టాండ్ ప్రాంతాలు, నాంపల్లిగుట్ట, అమ్మవారి కాంప్లెక్స్, రాజేశ్వరపురం, ప్రధాన ఆలయం ఎదురుగా, భీమేశ్వరాలయం వద్ద, సంస్కృత కళాశాలల్లో అత్యవసర ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వేములవాడకు వెళ్లే అన్ని రహదారుల్లో అత్యవసర కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు అంబులెన్స్లు, రెండు రెస్క్యూ టీమ్లను అందుబాటులో ఉంచారు.
మహా శివరాత్రి రోజు పూజలు..
మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 17వ తేదీ రాత్రి 9 గంటల నుంచి నీసీపూజ అనంతరం అన్ని పూజలు రద్దు చేసి భక్తుల సౌకర్యార్థం లఘు దర్శనం, కోడె మొక్కుబడి మాత్రమే నిర్వహిస్తారు. 18వ తేదీ నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు వేములవాడ పట్టణ వాసులకు సర్వదర్శనం, తెల్లవారుజామున 3.30 నుంచి 4 గంటల వరకు ఆలయ శుద్ధి చేయనున్నారు. 4 గంటల నుంచి 4.25 వరకు సుప్రభాతం, 4.25 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రాత:కాల పూజ, అనువంశిక అర్చకుల దర్శనం, ఉదయం 7 గంటల నుంచి టీటీడీ పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం, 8 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పట్టువస్త్రాల సమర్పణ, సాయంత్రం 4 గంటల నుంచి శివుని దర్శనం, సాయంత్రం 6.05 నిమిషాలకు శ్రీ స్వామివారి కల్యాణ మండపంలో మహాలింగార్చన నిర్వహిస్తారు. లింగోద్భవ కాలంలో 11.35 నిమిషాలకు శ్రీ స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు.
Rajendranagar Crime: పెట్రోల్ పోసుకుని మైనర్ బాలుడు ఆత్మహత్య..! కారణం తెలిస్తే..?