హైదరాబాద్లో జరుగుతున్న ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల లోగోను, స్టాంప్ను మోదీ ఆవిష్కరించారు. అనంతరం పలు స్టాళ్లను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ… వసంత పంచమి రోజున స్వర్ణోత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. గత 50 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న ఇక్రిశాట్ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపాలని మోదీ ఆకాంక్షించారు.
Read Also: సీఎం కేసీఆర్కు జ్వరం.. ప్రధాని కార్యక్రమానికి దూరం
వాతావరణ మార్పులను తట్టుకునే కొత్త వంగడాలను సృష్టించాలని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశంలో 170 కరువు జిల్లాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, బడ్జెట్లో సేంద్రీయ సాగుకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ ద్వారా రైతులకు తోడ్పాటునివ్వాలని చెప్పారు. వాతావరణ సవాలు నుండి మన రైతులను కాపాడటానికి తమ దృష్టి ప్రాథమికాంశాలపై భవిష్యత్ అవసరాలపై ఉందన్నారు. దేశంలో 80 శాతం మంది చిన్న రైతులు సంక్షోభం ఎదుర్కొంటున్నారని, వారి సాగు వ్యయం తగ్గించాల్సి ఉందన్నారు. బయో ఫ్యూయల్ వల్ల రైతుల ఖర్చులు తగ్గుతాయన్నారు. వ్యవసాయంలో టెక్నాలజీని పెంచుతున్నామని, డిజిటల్ అగ్రికల్చర్ పెంచాలనే లక్ష్యంతో ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పామాయిల్ సాగును మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు. దేశంలో ఆహార ధాన్యాలు సరిపడా ఉన్నాయని, న్యూట్రిషన్ సెక్యూరిటీపై దృష్టి పెట్టామని తెలిపారు.