ఈనెల 17 నుంచి 24 వరకు కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత పుష్కరాలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్ద నిర్వహించనున్న ప్రాణహిత పుష్కరాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఆయన పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వర్ రావు, అదనపు కలెక్టర్ రాజేశం, వరుణ్రెడ్డి హాజరయ్యారు.
ప్రాణహిత పుష్కరాలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. గతంతో పోలిస్తే ప్రస్తుత పుష్కరాలకు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. అన్ని శాఖల అధికారులకు చేసే పనులకు సంబంధించి లక్ష్యాలు నిర్ధేశించాలని, వాటిని నిర్దేశించిన గడువు లోపు పూర్తి చేయాలన్నారు. పుష్కర ఘాట్లు, రహదారులు, అంతర్గత రహదారులతో పాటు అనుసంధాన రహదారుల పనులు పూర్తి చేయాలన్నారు. వేసవి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లతో పాటు పిండప్రదానాలు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. వాహనాల నిలుపుదల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలీసులు బందోబస్తు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.