ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడంతో టీఆర్ఎస్ భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ సంబరాల్లో డిప్యూటీ సీఎం మహమూద్అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు ఇతర పార్టీ నేతలు సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ… ప్రతి పక్షాలు సంఖ్యా బలం లేకున్నా పోటీ చేశాయన్నారు. ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసి ఏదో రకంగా గెలవాలని చూశాయన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు మాకు కావాలని దేశ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రతి పక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్నారు. డబ్బుల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టాలని చూశారు. కానీ వారి ఆటలు సాగలేదని వారన్నారు. ఏ ఎన్నికలైనా టీఆర్ఎస్దే విజయమని మరోసారి రుజువు చేశాయన్నారు.
అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో టీఆర్ఎస్ విజయాల పరంపర కొనసాగుతుందన్నారు. శాసనమండలిలో ఇతర రాజకీయ పార్టీలకు అవకాశం లేదు. మాకు ఓట్లు రాకపోతే రాజీనామాలు చేస్తాం అనే మాటలు విన్నాం వారు ఇప్పుడు ఏం చేస్తారో ఆలోచించుకోవాలన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలే ఈ విజయాలకు నిదర్శనమన్నారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు వాగిన వారికి ఈ విజయం చెంప పెట్టు లాంటిదన్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు.