తెలంగాణలో ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించాల్సిన టెన్త్, ఇంటర్ పరీక్షలు కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు.. షెడ్యూల్ ప్రకారం జులైలో పరీక్షలు జరగాల్సి ఉండగా.. పరీక్షలపై నివేదిక పంపించాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది ప్రభుత్వం.. రెగ్యులర్ టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో ఓపెన్ స్కూల్స్ సొసైటీ పరీక్షలు రద్దు చేయాలని రిపోర్ట్ ఇచ్చారు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు.. అయితే, దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.. గతేడాది కూడా రద్దు అయిన పరీక్షలు.. మినిమం పాస్ మార్క్స్ వేసి అందరిని ఉత్తీర్ణులను చేసింది సర్కార్..
ఇక, ఈ ఏడాది అడ్మిషన్స్, పరీక్ష ఫీజు చెల్లించిన వారి సంఖ్య కూడా పెరిగిపోయింది.. ఎలాగు పరీక్షలు జరగవు పాస్ చేస్తారు అనే ఉద్దేశ్యంతో ఎక్కువ మంది అడ్మిషన్స్ తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అధికారులు… 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు 63,581 మంది ఉండగా.. ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థుల సంఖ్య 47,392గా ఉంది.. మొత్తం లక్షా 10 వేల 9 వందల 73 మంది విద్యార్థులు ఉన్నారు.. అధికారికంగా ప్రకటన రాకపోయినా.. ఇప్పటి సమాచారం ప్రకారం.. అందరూ పాస్ అయినట్టే.. గత ఏడాది పరీక్ష ఫీజు చెల్లించినవారి సంఖ్య 77,964 కాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 33 వేలు పెరిగింది..