హైదరాబాద్ కృష్ణానగర్లో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. తరగతి గదిలో సరదాగా ఆడుకున్న ఆట ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణానగర్లోని సాయికృప హైస్కూలులో పదో తరగతి విద్యార్థులు పేపర్ బాల్తో క్రికెట్ ఆడుకున్నారు. ఈ క్రమంలో ఆటలో భాగంగా విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో విద్యార్థులు ఘర్షణ పడ్డారు. నలుగురు విద్యార్థులు ఒకరినొకరు తోసుకున్నారు. బౌలింగ్ సరిగా చేయడం లేదంటూ తోటి విద్యార్థులు మన్సూర్పై దాడి చేయగా అతడికి తీవ్ర గాయాలయ్యాయి.
మన్సూర్ అనే విద్యార్థి తరగతి గదిలోనే కుప్పకూలడంతో తోటి విద్యార్థులు ఈ సమాచారాన్ని యాజమాన్యానికి చేరవేశారు. దీంతో వెంటనే పాఠశాల యాజమాన్యం విద్యార్థిని ఆసుపత్రికి తరలించింది. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.