కేసీఆర్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడిందని..అందుకే చిల్లర రాజకీయాలు చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీ ఎస్ ఎస్ ప్రభాకర్. ఇవాళ ఆయన కరీంనగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పాలన స్తంభించిందని.. రాజకీయమే పరమావధిగా టీఆర్ ఎస్ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ ప్రజా ప్రతినిధులనే కొనుగోలు చేసే దౌర్భాగ్య పరిస్థితికి టీఆర్ ఎస్ ప్రభుత్వం దిగజారిందని నిప్పులు చెరిగారు. తెలంగాన రాష్ట్రంలో రైతుల సమస్యను రాజకీయం చేసి లబ్ది పొందాలనుకోవడం అవివేకమన్నారు. రైతుల పంటను సక్రమంగా కొనుగోలు చేయలేక యాసంగి పంటపై లేనిపోని తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం మేరకు పంట కొనుగోళ్లు చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటన చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని బాధనాం చేయాలని టీఆర్ ఎస్ ప్రయత్నిస్తోందని నిప్పులు చెరిగారు.