రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై ఫిర్యాదు చేసినప్పటికీ తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకోలేదంటూ కాంగ్రెస్ పార్టీ పోలీస్ స్టేషన్ల ముందు ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు.
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు నుంచి ఎన్ఎ్సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, ఇతర కార్యకర్తలు సీపీ ఆఫీసు వైపునకు దూసుకొచ్చారు. పోలీసులు అడ్డగించడంతో తోపులాట జరిగింది. కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు బలవంతంగా వారిని వాహనాల్లో తీసుకెళ్లారు. మనోభావాలు దెబ్బ తీసే లా వ్యవహరించారని వెంకట్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. అర్థరాత్రి ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ని అరెస్ట్ చేశారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు పోలీసులు.