ఉస్మానియూ యూనివర్సీటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ను ఎన్ఎస్యూఐ విద్యార్థులు ముట్టడించారు. ఏఐసీసీ నేత రాహుల్గాంధీ సభకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ.. బిల్డింగ్ గేట్లు ఎక్కి లోపలికి విద్యార్థులు దూసుకెళ్లారు. అంతేకాకుండా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అద్దాలను విద్యార్థులు ధ్వంసం చేశారు. దీంతో 17 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా పోలీసుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ.. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ సహా విద్యార్థులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
వారిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. అరెస్టైన ఎన్ఐసీయూ విద్యార్థులను పరామర్శిచేందుకు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సైతం పోలీసులు నిర్భందించారు. అయితే.. ఈనెల 6,7 తేదీల్లో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ ఓయూలో పర్యటించేందుకు వీసీ అనుమతులు కోరగా.. అందుకు ఆయన నిరాకరించారు. దీంతో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు.