తెలంగాణలో సంచలనం కలిగించిన డ్రగ్స్ మరణం కేసుకి సంబంధించి నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ కీలక దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో వెలుగు చూస్తున్న అంశాలు అధికారులనే విస్మయానికి గురిచేస్తున్నాయి. తొలి డ్రగ్స్ మరణానికి సంబంధించిన కేసులో లక్ష్మీపతి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. లక్ష్మీపతి కోసం మూడు నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గోవా, అరకు, విశాఖ, తణుకులో లక్ష్మి పతి తలదాచుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబీకులతో సంబంధాలు లేకపోవడం, తరచూ మకాం మారుస్తుండటంతో కష్టతరంగా మారిం లక్ష్మీపతి ఆచూకీ. గతంలో 2020 నవంబర్ 27న మల్కాజ్గిరి (ఎస్వోటీ) పోలీసులు లక్ష్మీపతిని అరెస్టు చేశారు. లక్ష్మీపతికి చెందిన పూర్తి వివరాలు, అతని ఇన్ఫార్మర్ల కు చెందిన వివరాలు కొన్ని ఆధారాలు సేకరించారు పోలీసులు. లక్ష్మీ పతికి ఐటీ వింగ్ లో భారీ నెట్ వర్క్ వుంది. ఐటీ ఉద్యోగుల టార్గెట్ గా హాష్ ఆయిల్ విక్రయాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే లక్ష్మీపతి కాల్ డేటా సేకరించారు పోలీసులు.
లక్ష్మీపతి మొబైల్ ఫోన్ సిగ్నల్స్ కాల్ డేటా ఆధారంగా విచారిస్తున్నారు. హాష్ ఆయిల్ని కల్తీ చేసి అమ్ముతున్నట్లు నిర్దారణకు వచ్చారు. లక్ష్మీపతి బీటెక్ స్టూడెంట్. అతను ఓ పోలీసు అధికారి కొడుకుగా నిర్దారణకు వచ్చారు. అరకు నుండి విశాఖ ఏజెన్సీకి చెందిన అనేకమంది గంజాయి సరఫరాదారులతో పరిచయాలు వున్నాయి. తెలంగాణ లోని రాచకొండ, హైదరాబాద్, నల్లగొండలోనూ గంజాయి హాష్ ఆయిల్ విక్రయం జోరుగా సాగుతోంది.
అరకులో గంజాయి పెడ్లర్ నగేష్ సహాయంతో హాష్ ఆయిల్ దందా సాగిస్తున్నాడు. మీర్ పేట, బీరంగూడ కు చెందిన మోహన్రెడ్డి లక్ష్మీపతి కి ప్రధాన అనుచరుడుగా గుర్తింపు పొందాడు. జూబ్లీహిల్స్, మియాపూర్, మాదాపూర్, భువనగిరి, విశాఖపట్నాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని దందా సాగిస్తాడని తెలుస్తోంది. అరకు విశాఖ మీదుగా లీటర్ల కొద్దీ హాష్ ఆయిల్ సరఫరా జరుగుతోంది. ఆన్లైన్లోనూ అమ్మకాలు సాగిస్తున్నాడు. ఆన్లైన్లో ఆహారం, కిరాణా సరుకులు విక్రయించే డుంజో, పోర్టర్, ఉబెర్, స్విగ్గీ వంటి యాప్స్ ద్వారా మారు పేర్లతో హాష్ ఆయిల్ విక్రయాలు సాగిస్తున్నట్టు విచారణలో తేలింది.