సీనియర్ పొలిటికల్ లీడర్ మోత్కుపల్లి నర్సింహులు.. టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. గత కొంత కాలంగా ఆయన కారెక్కుతారు అనే ప్రచారం సాగుతోంది.. సీఎం కేసీఆర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ప్రభుత్వ పథకాలను సమర్థిస్తున్నారు.. ఇక, తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధుకు సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. సీఎం కేసీఆర్ను తెలంగాణ అంబేద్కర్గా అభివర్ణించారు.. మరోవైపు.. మోత్కుపల్లి.. టీఆర్ఎస్లో చేరడం.. ఆయనను దళిత బంధు ఛైర్మన్గా నియమించేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు కూడా వచ్చాయి.. ఈ నేపథ్యలో ఈ నెల 18వ తేదీన టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు మోత్కుపల్లి.. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.. మోత్కుపల్లికి టీఆర్ఎస్ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించనున్నారు.. తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున అనుచరులతో గులాబీ కండువా కప్పుకోనున్నారు మోత్కుపల్లి.
కాగా, సీనియర్ పొలిటికల్ లీడర్ అయిన మోత్కుపల్లి నర్సింహులు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు. ఆయన సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీలో పనిచేశారు.. 1983లో తొలిసారి ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్థి సల్లూరు పోశయ్యపై గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో టీడీపీలో చేరాడు. 1985లో ఆలేరు నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్థి చెట్టుపల్లి కెన్నెడీపై గెలిచి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక, 1991లో నంద్యాల లోక్సభకు జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పీవీ నరసింహారావు పై పోటీచేసి ఓడిపోయారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రమంగా టీడీపీతో గ్యాప్ వచ్చింది.. చంద్రబాబు వైఖరిని ఆయన తప్పుబట్టడంతో.. 2018, మే 28న ఆయనను బహిష్కరించింది తెలుగుదేశం పార్టీ.. ఇక, ఆయన 4 నవంబర్ 2019లో భారతీయ జనతా పార్టీలో చేరారు.. సీఎం కేసీఆర్ దళితబంధుపై నిర్వహించిన సమావేశానికి వెళ్లకూడదని బీజేపీ నిర్ణయించినా.. ఆయన ఆ సమావేశంలో పాల్గొని.. కేసీఆర్ నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు.. దీంతో బీజేపీతో కూడా గ్యాప్ వచ్చింది.. 23 జులై 2021న భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 18వ తేదీన టీఆర్ఎస్లో చేరనున్నారు మోత్కుపల్లి.