విజయవాడలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నేత వినోద్ జైన్ తనను వేధిస్తున్న విధానాన్ని ఆమె తన పుస్తకంలో రాసినట్టు, సదరు టీడీపీ నేత కూడా బాలిక నివసిస్తున్న అపార్ట్ మెంట్ లోనే ఉంటునట్లు తెలిసింది. టీడీపీ నేత వినోద్ జైన్ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. బాలిక ఆత్మహత్య ఘటన నేపథ్యంలో టీడీపీ వినోద్ జైన్ ను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. బాలిక మృతిపై పోక్సో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినోద్ జైన్ ను అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. బాలిక ఆత్మహత్యపై టీడీపీ నేతలు ఏంచెబుతారని నిలదీశారు. బాలిక బలవన్మరణానికి పాల్పడడం బాధాకరమని అన్నారు. స్త్రీలపై వేధింపులకు పాల్పడే టీడీపీ నేతలు నారీ సంకల్ప దీక్ష ఎలా చేస్తారని రోజా ప్రశ్నించారు. 60 ఏళ్ల వ్యక్తి బాలికను తండ్రిలా చూసుకోవాల్సింది పోయి, ఎలా వేధించాడో ఆ బాలిక పుస్తకంలో రాసుకున్న దాన్నిబట్టి అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. తప్పుడు పనులు చేసేది టీడీపీ నేతలే అని, దాన్ని ఇతరులపైకి నెడుతుంటారని ఆరోపించారు. అటు, ఆసుపత్రి మార్చురీ వద్ద బాలిక మృతదేహాన్ని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. ఆమె తల్లిదండ్రులను ఓదార్చారు.