వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే యూపీ సీఎంగా యోగి అదిత్యనాథ్ ఎన్నికల బరిలో ఉండగా.. యోగికి ఓటు వేయకుంటే బుల్డోజర్లు ఎదుర్కొవాల్సి వస్తుందంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. యూపీలో హిందువులంతా ఏకమవ్వాలని ఆయన అన్నారు. యోగి అదిత్యనాథ్కు ఓటు వేయని ప్రాంతాలను గుర్తించి అక్కడికి జేసీబీలు, బుల్డోజర్లు పంపుతామని ఆయన అన్నారు.
యూపీలో ఉండాలంటే యోగి అనాలి అని, లేకుంటే ఉత్తరప్రదేశ్ వదిలి పారిపోవాలని ఆయన హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్లో యోగిబాబా ప్రభుత్వం రాబోతుందని రాజాసింగ్ అన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే యూపీలో యోగి పాలనపై అసంతృప్తి ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి తలనొప్పిని తీసుకువస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.