Telangana Cinematography Minister Talasani Srinivas Yadava Addressed in May Day Celebrations held In Kotla Vijay Bhaskar Reddy Stadium.
హైదరాబాద్ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినిమా ఇండస్ట్రీ కార్మికులు నిర్వహించిన మే డే ఉత్సవాల్లో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే డే వచ్చిదంటే యావత్ ప్రపంచమంతా కార్మిక దినోత్సవం జరుపుకుంటుందని, 24 విభాగాలకు సంబంధించిన లక్షలాది మంది కార్మికులు ఉన్నారని, రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి సినీ కార్మికులదన్నారు. కరోనా కాలంలో చాలా ఇబ్బందిపడ్డారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తోందని, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా మెగాస్టార్ చిరంజీవి ఉన్నారన్నారు. ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా సినీ పరిశ్రమ పచ్చగా ఉండాలన్నది చిరంజీవి ఆకాంక్ష అని, చిరంజీవి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కులం, మతం లేదని, యూసఫ్ గూడ, కృష్ణానగర్, కార్మికనగర్, చిత్రపురిలో వేలాది మంది సినీ కార్మికులు జీవిస్తున్నారన్నారు. కార్మిక శాఖ ద్వారా ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్మికులకు కావాల్సిన సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. ఇళ్లు లేని సినీ కార్మికులకు రాబోయే కాలంలో చిత్రపురిలో ఇళ్లు ఇస్తామని, తెలంగాణ ప్రభుత్వం సినీ కార్మికుల వెంటే ఉంటుందన్నారు. చిరంజీవి పెద్ద ఆస్పత్రి కట్టాలనే సంకల్పంతో ఉన్నారని, చిత్రపురిలోని పాఠశాలు, ఆస్పత్రికి కావాల్సిన స్థలం ఉందని, చిరంజీవి చిత్రపురి స్థలంలో ఆస్పత్రి నిర్మిస్తే కొన్ని వేల మంది కార్మికులకు ఉపయోగపడుతుందన్నారు.