Minister Seethakka : తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్ల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవాలని రాష్ట్ర మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రజా భవన్లో చేయూత పెన్షన్ల పంపిణీపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి సెర్ప్ (SERP) సీఈవో దివ్యా దేవరాజన్, డైరెక్టర్ గోపి, జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్లు హాజరయ్యారు.
పెన్షన్ల పంపిణీలో నూతన టెక్నాలజీని తప్పనిసరిగా అందిపుచ్చుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సులువుగా పెన్షన్ అందేలా సాంకేతికతను ఉపయోగించుకోవాలని చెప్పారు. ముఖ్యంగా, ఫేషియల్ రికగ్నిషన్ (facial recognition) ద్వారా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెన్షన్లు అందించడం ప్రభుత్వ సామాజిక బాధ్యత అని మంత్రి పునరుద్ఘాటించారు. ప్రతి నెలా వెయ్యి కోట్ల రూపాయల పెన్షన్ను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
IND vs ENG: తొలి ఇన్నింగ్స్లో భారత్ 358 ఆలౌట్.. గాయంతోనే హాఫ్ సెంచరీ చేసిన రిషబ్ పంత్
“నిజమైన లబ్ధిదారులకు పెన్షన్ చేరే విధంగా అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయాలి,” అని సీతక్క స్పష్టం చేశారు. అనర్హులు పెన్షన్ తీసుకుంటే నిజమైన పేదవారికి అన్యాయం చేసినట్లు అవుతుందని హెచ్చరించారు. సాంకేతిక కారణాలతో పెన్షన్ పంపిణీ ఆలస్యమైతే, ముందే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడమేకాకుండా, ఇందిరా మహిళా క్యాంటీన్లు, ప్రమాద భీమా ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి తెలిపారు. 15 సంవత్సరాల వయస్సు నుంచే మహిళలను మహిళా సంఘాలలో సభ్యులుగా చేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. “మహిళ ఆర్థికంగా ఎదిగితే కుటుంబం బాగుపడుతుంది,” అని ఆమె అన్నారు.
ఆర్టీసీలో 200 కోట్ల మహిళా ప్రయాణాలు జరిగాయంటే మహిళలకు ‘ఫ్రీ బస్సు’ పథకం ఎంతగా ఉపయోగపడుతుందో అర్థమవుతుందని మంత్రి సీతక్క అన్నారు. “మహిళలు ఫ్రీ బస్సు ఎక్కడమే కాదు… మహిళలను బస్సు ఓనర్లను చేసింది మా ప్రభుత్వం,” అని వ్యాఖ్యానించారు.
పేదరికం తగ్గించకపోతే సమాజంలో అంతరాలు పెరుగుతాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. “పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇచ్చే పెన్షనే చేయూత… అదే వారి ధైర్యం,” అంటూ వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు.
Peddapuram: పెద్దాపురంలో చీకటి బాగోతం.. మహిళ ఆవేదన వింటే చలించిపోతారంతే..!