Minister Seethakka : దేశవ్యాప్తంగా ఎల్ నీనో (El Niño) పరిస్థితులు నెలకొన్నాయని, ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రాబోయే వేసవి పరిస్థితులు , నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని మిషన్ భగీరథ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. రాబోయే వంద రోజుల పాటు రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని, నీటి సరఫరాపై ప్రతి 15 రోజులకు ఒకసారి తాను స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని స్పష్టం చేశారు. విధుల పట్ల అశ్రద్ధ లేదా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
16వ ఆర్థిక సంఘం నిధులతో ప్రత్యామ్నాయ చర్యలు
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సదుపాయానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ కూడా ఉన్నాయని మంత్రి గుర్తుచేశారు. గ్రామాల్లో ఎక్కడైనా అత్యవసరంగా తాగునీటి సమస్య తలెత్తితే 16వ ఆర్థిక సంఘం నిధులను ఉపయోగించి ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్థానిక నీటి వనరులను (Local Sources) మరింత మెరుగుపరచాలని, నిరుపయోగంగా ఉన్న బోర్వెల్స్కు వెంటనే మరమ్మతులు చేసి సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలున్న గ్రామాలను గుర్తించి, వారం రోజుల్లోగా ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు.
పైప్ లీకేజీలు ఉంటే ముందస్తు సమాచారం ఇవ్వాలి
మండలాల వారీగా అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలని, ఎక్కడా సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ఏదైనా పైప్లైన్ లీకేజీలు లేదా రిపేర్ల కారణంగా ఒక రోజు నీటి సరఫరా నిలిచిపోతే, ఆ విషయాన్ని గ్రామస్తులకు ముందుగానే సమాచారం అందించాలని సూచించారు. దీనివల్ల ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకుని సిద్ధంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. ఎల్ నీనో తీవ్రత దృష్ట్యా మిషన్ భగీరథ ఇంజనీర్లు , అసిస్టెంట్ ఇంజనీర్లు (AE) మరింత జవాబుదారీతనంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
గిరిజన తండాలపై ప్రత్యేక దృష్టి.. జలసిరి విజయవంతం కావాలి
మిషన్ భగీరథతో ఇంకా అనుసంధానం కాని ఆదివాసీ, గిరిజన గ్రామాల్లో ఏఈలు స్వయంగా పర్యటించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని సీతక్క ఆదేశించారు. ప్రతి మండలంలో ఏఈలు స్థానిక సర్పంచ్లతో సమావేశమై మంచినీటి సరఫరా తీరుపై సమీక్షించాలని చెప్పారు. గతంలో కూడా ఎల్ నీనో పరిస్థితులు ఉన్నప్పటికీ సమర్థవంతంగా పనిచేసి నీటి ఎద్దడి లేకుండా చూశామని, ఇప్పుడు కూడా అదే పట్టుదలతో పనిచేయాలని కోరారు. “జలసిరి” కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ వర్షపు నీటిలోని ప్రతి బొట్టునూ ఒడిసిపడితే భవిష్యత్తులో ఇలాంటి తాగునీటి సమస్యలను శాశ్వతంగా అధిగమించవచ్చని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

