ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దుండిగల్ పరిధిలోని బహదూర్పల్లిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వొకేషనల్ కాలేజీకి కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ప్రమాణాలను పెంచుతున్నామని అన్నారు. 2013లో ఇదే కాలేజీ ఆవరణ నుంచి ఉద్యమంలో భాగంగా సకల జనుల భేరీ నిర్వహించామని, శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ ఇక్కడ్నుంచే ప్రారంభించామన్నారు. ఇదే కాలేజీలో అప్పుడు పాడుబడ్డ గోడలు.. శిథిలావస్థ భవనాలు ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ కాలేజీని అద్భుతంగా తీర్చిదిద్దారని, వొకేషనల్ కాలేజీకి కూడా శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈనేపథ్యంలో.. మనకంటే మన పిల్లలు ఉన్నతస్థితిలో ఉండాలని తల్లిదండ్రులూ కోరుకుంటారని, అది జరగాలంటే, ప్రాథమిక .. మాధ్యమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు.
read also: Telangana Weather Report: వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు
అంతేకాకుండా.. గత 8 ఏండ్లలో కేసీఆర్ విద్యా ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్నారు. అంగన్ వాడీ విద్య నుంచి మొదలుకొంటే యూనివర్సిటీ విద్య వరకు మార్పులు తెచ్చి, విద్యా ప్రమాణాలను పెంచేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రాథమిక నుంచి మాధ్యమిక విద్య వరకు 973 గురుకుల పాఠశాలలు స్థాపించాం. నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా, ఇతర వసతులు కల్పిస్తున్నాం. ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అంతేకాకుండా.. గురుకుల విద్యార్థులు ఐఐటీలో సీట్లు సాధిస్తున్నారంటే అది ప్రభుత్వ కృషి మాత్రమే అని , ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత 65 ఏండ్లలో ఐదు మెడికల్ కాలేజీలు వస్తే, జిల్లాకు ఒకటి చొప్పున 33 మెడికల్ కాలేజీలు మంజూరు చేసామని గుర్తు చేశారు. ఈనేపథ్యంలో.. విద్యా రంగంలో గతంలో జరగని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు.