తెలంగాణకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలంటూ మంత్రి హరీష్రావు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు.గతంలో చేసిన అభ్యర్థనలను ఈ లేఖలో గుర్తు చేశారు మంత్రి హరీష్ రావు. A.P. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (2) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేండ్ల బకాయి రూ.900 కోట్లు ఇంకా విడుదల చేయాల్సి ఉందన్నారు. దీంతో పాటు గ్రాంట్ను 2021-22 తర్వాత ఐదేళ్లపాటు పొడిగించాలని కోరుతున్నట్టు హరీష్ రావు లేఖలో తెలిపారు. నీతిఆయోగ్ సూచించిన మేరకు రూ.24,205 కోట్లు విడుదల చేయాలని కోరారు. స్థానిక సంస్థలకు రూ.817.61 కోట్లు (గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 315.32 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ. 502.29 కోట్లు) ఇవ్వాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం ఎందుకు తిరస్కరించిందో చెప్పాలని లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రం అన్ని షరతులను పూర్తి చేసినప్పటికీ, నిర్దిష్ట కారణం లేకుండా ఈ గ్రాంట్లను తిరస్కరించారన్నారు. వీలైనంత త్వరగా ఈ గ్రాంట్లను విడుదల చేయాలని కోరారు. 2019-20తో పోల్చితే 2020-21లో రాష్ట్రానికి పన్నుల్లో వాటా తగ్గుతుందని ఈ మేరకు తెలంగాణకు రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయాలని 15వ ఆర్థిక సంఘం సూచించింది. ఆర్థిక సంఘం సిఫార్సులను గతంలో ఎప్పుడూ తిరస్కరించలేదని ఆలస్యం చేయకుండా ఈ నిధులను వెంటనే మంజూరు చేయాలని మంత్రి హరీష్ రావు నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు.
Read Also: ఏపీలో కొత్తగా 14,502 కేసులు నమోదు
రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకాలలో… రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరమైన 2014-15లో కేంద్రం వాటాను పొరబాటున తెలంగాణకు కాకుండా ఆంధ్రప్రదేశ్కు విడుదల చేశారు. దీంతో తెలంగాణకు రావాల్సిన రూ.495.20 కోట్లు ఆంధ్రప్రదేశ్కు వెళ్లాయి. ఈ విషయాన్ని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ, ఇంకా తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదని ఈ మొత్తాన్ని కూడా తెలంగాణకు విడుదల చేయాలన్నారు. వీటితోపాటు పెండింగ్లో ఉన్న ఐజీఎస్టీ నిధులు రూ.210 కోట్లను కూడా సర్దుబాటు చేయాలని మంత్రి హరీష్ రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను లేఖలో కోరారు.