ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీష్రావు ఎన్నికయ్యారు.. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీష్రావు ఎన్నికయినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది.. ఇక, తమ విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకు కమిటీ సభ్యులు మంత్రి హరీష్ రావును ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ సొసైటీని మరింత ముందుకు తీసుకెళ్తానని ప్రకటించారు.. ఎగ్జిబిషన్ సొసైటీని మరింత ప్రగతి పథంలో నడిచేలా శక్తివంచన లేకుండా పని చేస్తానని.. తనను కలిసిన సోసైటీ యాజమాన్య కమిటీ ప్రతినిధులతో తెలిపారు.
నా బాధ్యత మరింత పెరిగిందన్న మంత్రి హరీష్రావు.. ప్రతిష్టాత్మక సంస్థను అందరం కలిసి ముందుకు తీసుకెళ్దామన్నారు.. గత 80 ఏళ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వహిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నుమాయిష్ ను విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందేలా కలిసి పని చేద్దామన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా చేద్దామన్నారు హరీష్రావు.. కాగా, గతంలో ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు.. ఆయన మంత్రి పదవి కోల్పోవడం.. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి, ఇతర పదవులకు కూడా రాజీనామా చేశారు. ఇక, ఆ తర్వాత కొన్ని అక్రమాలు జరిగాయంటూ.. ఏసీబీ సైతం పలు సందర్భాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.