Maoists Surrender : తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి చావుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాలకు ఆకర్షితులై, హింసా మార్గాన్ని వీడి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నిర్ణయించుకున్న 47 మంది మావోయిస్టులు రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. ఈ లొంగుబాటులో రాష్ట్ర కమిటీకి చెందిన 27 మందితో పాటు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన కీలక సభ్యులు, సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యులు ఉండటం గమనార్హం. వీరంతా తమ వెంట 34 అత్యాధునిక ఆయుధాలను కూడా పోలీసులకు అప్పగించి, శాంతియుత జీవనం వైపు అడుగులు వేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిజిపి శివధర్ రెడ్డి మాట్లాడుతూ, లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి హోదాను బట్టి ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేసిందని, రాష్ట్ర కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు, డివిజన్ కమిటీ సభ్యులకు 5 లక్షల రూపాయలు, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షల రూపాయలు , పార్టీ మెంబర్లకు లక్ష రూపాయల చొప్పున పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. వీరు అప్పగించిన ఆయుధాలకు కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనపు నగదు ప్రోత్సాహకాలు అందనున్నాయి. ముఖ్యంగా ఎల్ఎమ్జీ ఆయుధాలకు 5 లక్షలు, ఏకే-47లకు 4 లక్షల రూపాయల చొప్పున రివార్డులు లభిస్తాయి. మొత్తంగా ఈ 47 మందికి కలిపి సుమారు కోటి 50 లక్షల రూపాయల పునరావాస సహాయం అందుతోంది.
కేవలం ఆర్థిక సహాయమే కాకుండా, లొంగిపోయిన వారి ఆరోగ్య భద్రతకు కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వీరికి త్వరలోనే ప్రత్యేక హెల్త్ కార్డులను జారీ చేయనున్నారు. ఈ కార్డుల ద్వారా నిమ్స్ వంటి ప్రతిష్టాత్మక ఆసుపత్రులలో వీరు ఉచితంగా వైద్య సదుపాయాలు పొందవచ్చు. గత రెండేళ్ల కాలంలో తెలంగాణ పోలీసుల సమర్థత వల్ల సుమారు 818 మంది మావోయిస్టులు లొంగిపోయారని, ఇది రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పరిణామమని డిజిపి అభివర్ణించారు. అజ్ఞాతంలో ఉన్న ఇతర సభ్యులు కూడా హింసా మార్గాన్ని వీడి ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ భారీ ఆపరేషన్ను విజయవంతం చేసిన ఎస్ఐబీ , ఇంటెలిజెన్స్ విభాగ అధికారులను డిజిపి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
