Site icon NTV Telugu

Arrangements For Mahashivratri: శివరాత్రికి ముస్తాబైన ప్రముఖ శైవ క్షేత్రాలు

Shivaratri

Shivaratri

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవ క్షేత్రాలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పంచారామ క్షేత్రాలతో పాటు ప్రముఖ శైవ ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ముఖ్యంగా కోటప్పకొండ, అమరావతి, దైద క్వారీ , గోవాడ వంటి క్షేత్రాల్లో భక్తుల సౌకర్యార్థం అధికారులు ముందెన్నడూ లేని విధంగా అత్యంత భారీ ఏర్పాట్లు చేపట్టారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో వెలసిన త్రికోటేశ్వర స్వామి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ ఏడాది శివరాత్రికి సుమారు 3 నుండి 5 లక్షల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కోటప్పకొండ ప్రత్యేకత అయిన విద్యుత్ ప్రభలు ఇప్పటికే వివిధ గ్రామాల నుండి కొండకు చేరుకుంటుండటంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. అయితే శివరాత్రికి ముందే, అంటే శనివారం మధ్యాహ్నం నుండే భక్తుల తాకిడి ఊహించని విధంగా పెరగడంతో కొండకు వెళ్లే ప్రధాన రహదారులన్నీ వాహనాలతో పూర్తిగా నిండిపోయాయి.

Bangladesh: భారత సంబంధాలపై తారిఖ్ రెహ్మన్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

లక్షలాదిగా తరలివచ్చే భక్తుల దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో కోటప్పకొండ పైకి ప్రైవేట్ వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. భక్తులు తమ సొంత వాహనాలను కొండ కింద కేటాయించిన నిర్ణీత పార్కింగ్ స్థలాల్లోనే ఉంచాల్సి ఉంటుంది. అక్కడ నుండి భక్తులను కొండపైకి చేరవేసేందుకు ఆర్టీసీ అధికారులు సుమారు 120 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. భక్తులు కేవలం ఈ ప్రభుత్వ బస్సుల ద్వారా మాత్రమే కొండపైకి చేరుకునేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.

భక్తుల భద్రత కోసం సుమారు 3,000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచారు. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తుల కోసం దేవాదాయ శాఖ చలువ పందిళ్లు, తాగునీరు , మజ్జిగ పంపిణీ కేంద్రాలను సిద్ధం చేసింది. అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇతర క్షేత్రాల్లో కూడా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన క్యూ లైన్లను క్రమబద్ధీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, భక్తులందరికీ త్వరగా దర్శనం కలిగేలా అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తోంది.

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడలో మహాశివరాత్రి జాతర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 16 వరకు జరిగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవాల ఏర్పాట్లను ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీలు మహేష్ బి. గీతే, రుత్విక్‌సాయిలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్‌లు, చలువ పందిళ్లు, పారిశుధ్యం, జలప్రసాదం , తాత్కాలిక టాయిలెట్ల వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తూ, షిఫ్ట్‌ల వారీగా సిబ్బంది అందుబాటులో ఉండి జాతరను విజయవంతం చేయాలని ఆమె స్పష్టం చేశారు.

మరోవైపు, భక్తుల భద్రత కోసం భీమేశ్వర సదన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఎస్పీ పరిశీలించి, పట్టణవ్యాప్తంగా అమర్చిన సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. బద్ది పోచమ్మ, భీమేశ్వర, కేదారేశ్వర ఆలయాల్లో కూడా పక్కాగా ఏర్పాట్లు చేశామని, పోలీసు యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతూ భక్తులకు రక్షణ కల్పిస్తుందని అధికారులు వెల్లడించారు.

Ryzen 5 + 16GB RAM + SSD.. ఇప్పుడు 46,699 కే.! డీల్ మిస్ అవ్వకండి.!

Exit mobile version