హైదరాబాద్ శంషాబాద్ లోని ముచ్చింతల్ ఆశ్రమం మహాకార్యానికి వేదిక కాబోతోంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో సమతామూర్తి పేరిట నిర్మించిన 216 అడుగుల శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. చినజీయర్ స్వామిని కలిశారు.
శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ దివ్యసాకేతానికి వెళ్లారు శివరాజ్ సింగ్ చౌహాన్. కుటుంబసభ్యులతో కలిసి చినజీయర్ స్వామి ఆశ్రమంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రామానుజాచార్య విగ్రహం ఏర్పాటు చేసిన స్థలాన్ని ఆయన సందర్శించారు. ఆశ్రమ ప్రాంగణంలో మొక్కలు నాటారు. రావిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చినజీయర్ స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
.శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా సమతామూర్తి విగ్రహావిష్కరణ, సంబంధిత కార్యక్రమాల గురించి.. మధ్యప్రదేశ్ సీఎంకు చిన జీయర్ స్వామి వివరించారు. రామానుజాచార్య విగ్రహావిష్కరణ, ఉత్సవాలకు శివరాజ్ సింగ్ చౌహాన్ను ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఉత్సవాలు నిర్వహించే రోజులలో భారీఎత్తున హోమాలు నిర్వహిస్తారు. సమతామూర్తి విగ్రహానికి సమీపంలోనే దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఏర్పాట్లు చేశారు. 35 ఎకరాల విస్తీర్ణంలో 144 యాగశాలలు నిర్మించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 5వేల మంది రుత్వికులు, వేదపండితులు విచ్చేసి క్రతువులో పాల్గొంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు దఫాలుగా యాగాలు వుంటాయి.