Hyderabad Old City Protests: BJP MLA రాజాసింగ్ కు కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఓల్డ్ సిటీ అట్టుడుకుతోంది. నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. చార్మినార్ వద్ద ఓ వర్గం యువత భారీగా చేరుకుని పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేయడంతో వారు లాఠీఛార్జ్ చేశారు. శాలిబండ చౌరస్తాలో రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. పోలీసులు పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకుని శాలిబండ పోలీస్టేషన్కు తరలించారు. దీంతో పోలీసులు, పారా మిలటరీ దళాలు భారీగా మోహరించారు. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని నగర ప్రజలు భయపడుతున్నారు.
దీంతో రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తునన గోషామహల్కు వెళ్లే అన్ని రహదారులను మూసివేశారు. సిటీ కాలేజీ చౌరస్తాలో భారీకేడ్లను అడ్డంపెట్టి, అటు వైపుగా ఎవరినీ వెళ్లనీయడం లేదు. మూసాభౌలీ, హుస్సునీ ఆలం, చార్మినార్, శాలిబండ నుంచి ఆందోళనకారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో.. సిటీ కాలేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సిటీకాలేజీ నుంచి బేగంబజార్, హైకోర్టు వెళ్లే రహదారులను మూసి వేశారు. పాతబస్తీలోని ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజాసింగ్కు బెయిల్ ఎందుకు ఇచ్చారని ఆందోళనకారులు మండిపడ్డారు. కాగా.. దక్షిణ మండల డీసీపీ, అదనపు డీసీ పీ, ఎస్బీ అడిషనల్ డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులు సమీక్షిస్తున్నారు.