KTR : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అభ్యర్థుల గెలుపు, హంగ్ మున్సిపాలిటీల్లో వ్యూహాలు, ప్రతిపక్షాల పనితీరుపై ఆయన తన విశ్లేషణను పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సుమారు 30కి పైగా మున్సిపాలిటీలను సొంతం చేసుకుంటుందని భావించినప్పటికీ, తుది ఫలితాల్లో ఆ సంఖ్య కొంత మేర తగ్గిందని ఆయన అంగీకరించారు.
EC-Elections: 4 రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ కసరత్తు పూర్తి.. షెడ్యూల్ ఎప్పుడంటే…!
ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని (హంగ్) మున్సిపాలిటీల్లో పరిస్థితి తమకు అనుకూలంగా ఉందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా చైర్మన్ పీఠాలను దక్కించుకోవడంలో కీలకమైన ‘ఎక్స్ అఫీషియో’ ఓట్ల నమోదు విషయంలో ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) అధికారులతో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. తమ పార్టీకి ఉన్న ప్రజాప్రతినిధుల మద్దతుతో హంగ్ ఏర్పడిన చోట్ల కూడా పట్టు సాధిస్తామని స్పష్టం చేశారు.
మున్సిపల్ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని కేటీఆర్ విమర్శించారు. “కాంగ్రెస్ పార్టీ గాలిలో మేడలు కట్టింది కానీ, క్షేత్రస్థాయిలో ప్రజలు వారికి ఆశించినన్ని మున్సిపాలిటీలు ఇవ్వలేదు” అని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ పరిస్థితిని ప్రస్తావిస్తూ.. కరీంనగర్, నిజామాబాద్ వంటి ఒకటి రెండు ప్రాంతాల్లో మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ ప్రభావం శూన్యమని కొట్టిపారేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కొలమానం కాబోవని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. స్థానిక సమస్యల ప్రాతిపదికన జరిగిన ఈ ఎన్నికల ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో చర్చనీయాంశంగా మారిన ఫార్ములా-ఈ రేస్ కేసు గురించి ప్రస్తావిస్తూ.. ఆ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, దీనిపై అధికారులే స్పష్టత ఇస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పార్టీకి కొత్త పాఠాలను నేర్పాయని, భవిష్యత్తులో ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.