NTV Telugu Site icon

లాటరీ పద్ధతిలో బస్తీ వాసులకు ఇళ్ల కేటాయింపు: కేటీఆర్‌

ఇళ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, లాటరీ పద్ధతిలో బస్తీవాసులకు ఇళ్లు కేటాయిస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట డివిజన్‌ చాచా నెహ్రూనగర్‌లో నిర్మించిన 248 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని పేదలందరికి ఇండ్లు అందించే ప్రయత్నం చేస్తామన్నారు.

Also Read: లాభాల్లో ఉన్న బ్యాంకులను అమ్మడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే: గుత్తా సుఖేందర్‌రెడ్డి

నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారన్నారు. రూ.18 వేల కోట్లతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ప్రారంభించామని వెల్లడించారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడని పెద్దలు అంటారు.. అయితే ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లీ నేనే చేస్తానన్న ఏకైక సీఎం కేసీఆర్‌ అని చెప్పారన్నారు. మార్కెట్‌లో రూ.40 లక్షల విలువచేసే ఇంటిని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత పింఛన్‌ 10 రెట్లు పెంచామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూ.200గా ఉన్న పెన్షన్‌ను రూ.2 వేలు చేశామన్నారు. తెలంగాణ వచ్చాక విద్యుత్‌, తాగునీటి సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఇళ్ల విషయంలో ఎవరైనా లంచాలు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని కేటీఆర్‌ సూచించారు.