Site icon NTV Telugu

KTR : మూసీ మీద 15 బ్రిడ్జిలు.. బీఆర్ఎస్ ప్లానింగ్ చెప్పిన కేటీఆర్

Ktr

Ktr

మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ‘మింగడానికి మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె’ అన్న చందంగా ఉందని ఎద్దేవా చేసిన ఆయన, రాష్ట్ర ఖజానాలో ప్రజా హామీలకే నిధులు లేనప్పుడు మూసీ ప్రాజెక్టు కోసం వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని నిలదీశారు. గతంలో కేసీఆర్ అసెంబ్లీ వేదికగా తెలంగాణ నిర్మాణం గురించి ప్రెజెంటేషన్ ఇస్తే, నేటి ముఖ్యమంత్రి ఫైవ్ స్టార్ హోటళ్లలో కూర్చుని పేదల ఇళ్లను ఎలా విద్వంసం చేయాలో ప్రెజెంటేషన్లు ఇస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎప్పుడూ మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదని, అయితే సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చడాన్ని మాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు.

Uttam Kumar Reddy: గ్యాస్‌పై తెలంగాణ ప్రజలకు ఊరట.. మంత్రి కీలక ప్రకటన..

బీఆర్ఎస్ హయాంలో తాము అనుసరించిన అభివృద్ధి నమూనాను వివరిస్తూ, ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా ముషీరాబాద్ , నాగోల్ వంటి ప్రాంతాల్లో ఆరు కిలోమీటర్ల మేర మూసీని అద్భుతంగా సుందరీకరించి చూపించామని కేటీఆర్ గుర్తు చేశారు. తాము గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసిన ఫోటోలు కాకుండా, క్షేత్రస్థాయిలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపిస్తున్నామని చెప్పారు. మంచిరేవుల నుంచి ఘట్కేసర్ వరకు 57 కిలోమీటర్ల పరిధిలో మూసీ రూపురేఖలు మార్చాలని, అందులో భాగంగా 15 బ్రిడ్జిలు నిర్మించాలనే పక్కా ప్రణాళికతో తాము ఉన్నామని వెల్లడించారు. ఇప్పటికే మూసీ నీటిని శుద్ధి చేసేందుకు రూ. 3,866 కోట్లతో ఎస్టీపీ (STP) ప్లాంట్లు నిర్మించామని, కేసీఆర్ చేసింది మూసీ పునర్జీవమైతే, రేవంత్ రెడ్డి చేస్తోంది కేవలం ఇళ్ల విద్వంసమేనని ఆరోపించారు.

Durandhar 2: ధురంధర్ ది రివెంజ్ అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభం

ఇదే క్రమంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని కేటీఆర్ ఎండగట్టారు. పేదల ఇళ్లను కూల్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, మంత్రులు , అధికార పార్టీ నేతల ఇళ్ల విషయంలో ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు, మాదాపూర్‌లో ఆయన సోదరుడి ఇల్లు, అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి , సీనియర్ నేతలు వివేక్ వెంకటస్వామి, కేవీపీ రామచందర్ రావుల ఇళ్లు ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్లలో ఉన్నాయని, వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. ఒక్క ఇల్లు కట్టే తెలివి లేని ముఖ్యమంత్రికి వందల ఇళ్లు కూల్చే తెలివి ఉందని విమర్శించిన కేటీఆర్, బాధితులకు భరోసా ఇస్తూ మరో రెండేళ్లు తమ ఆస్తులను కాపాడుకోవాలని, త్వరలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక మూసీ ప్రాంత నివాసుల ఇళ్లకు చిన్న సున్నం కూడా చెదరకుండా సుందరీకరణ చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.

Exit mobile version