ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని, మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో పత్రికా విలేఖరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా మండల స్థాయి జర్నలిస్టులకు తగిన గుర్తింపు లేకపోవడం బాధాకరమని అన్నారు.
ప్రభుత్వం స్పందించి విలేకరులకు అక్రెడిటేషన్లు మంజూరు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, విద్యార్థులకు విద్యా భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన వంటి అంశాల్లో ప్రజలు నిరాశ చెందారని అన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం వారిని నిరాశపరిచిందని కేటీఆర్ విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రంలో మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

