KTR : ప్రముఖ తెలుగు వార్తా ఛానల్ ‘ఎన్టీవీ’ (NTV) కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మొన్న ముఖ్యమంత్రి విసిరిన సవాల్ను తాను స్వీకరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించానని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ వచ్చినా చర్చకు సిద్ధం
తెలంగాణ అభివృద్ధి లేదా ఇతర ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ, లేదా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గానీ ఎవరు చర్చకు వచ్చినా తాను సిద్ధమేనని నిన్ననే ప్రకటించినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. అయితే, అసలు సవాల్ విసిరిన వారు కాకుండా మధ్యలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎందుకు దూరాడో తనకు అర్థం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
సీఎల్పీ, గన్ పార్క్.. ఆ తర్వాత జూ పార్క్ కెళ్లారేమో
తానే స్వయంగా తెలంగాణ భవన్కు వస్తానని మంత్రి జూపల్లి ప్రకటించడంతో, ఉదయం నుంచి ఆయన కోసం తెలంగాణ భవన్లో వేచి చూశానని కేటీఆర్ తెలిపారు. కానీ జూపల్లి మాత్రం తెలంగాణ భవన్కు రాకుండా, కొద్దిసేపు సీఎల్పీ (CLP) లో ఉండి, ఆ తర్వాత గన్ పార్కులో వెయిట్ చేశారని విమర్శించారు. గన్ పార్క్ తర్వాత ఆయన బహుశా జూ పార్కుకు వెళ్లారేమో అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాము గన్ పార్కుకు వెళ్తామంటే పోలీసులు రానీయకుండా అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు.
వీళ్ల స్థాయికి కేసీఆర్ అవసరం లేదు
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టినా సరే తాము మాట్లాడటానికి , ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. “ఈ కాంగ్రెస్ నాయకుల స్థాయికి కేసీఆర్ గారు రావాల్సిన అవసరం లేదు.. ఆయన సైనికులుగా మేమే వీళ్లకు సమాధానం చెబుతాము” అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేవలం డ్రామాలు ఆడుతోందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.

