శతాబ్దపు ఘన చరిత్ర కలిగిన కోఠి ఉమెన్స్ కాలేజ్ కు మహిళా విశ్వ విద్యాలయం హోదా త్వరలోనే దక్కనుంది. దీని కోసం గతంలోనూ కేసీఆర్ సర్కార్ ప్రయత్నాలు చేయగా… కార్యరూపం దాల్చలేదు. కానీ.. ఈ విడత సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ నుంచి ఈ ప్రతిపాదన రావడంతో కోఠి ఉమెన్స్ కాలేజీ యూనివర్సిటీ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి వర్గ ఉప సంఘం సమావేశంలో కేటీఆర్ తాజాగా కోఠి మహిళా యూనివర్సిటీ ప్రతిపాదనను చర్చకు తీసుకు వచ్చారు. నిజాం పాలనలో 1924 లో ఏర్పాటు అయిన కోఠి మహిళా కళాశాల 2024 లో శతాబ్ది ఉత్సవాలకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నుంచి ఈ ప్రతిపాదన రావడం గమనార్హం. అయితే త్వరలోనే దీనిపై ప్రతిపాదనలను రూపొందించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ లెక్కన త్వరలోనే కోఠి ఉమెన్స్ కాలేజ్ పేరును కూడా మార్చే అవకాశం ఉంది.అయితే ఉమ్మడి ఏపీలో మహిళల కోసం తిరుపతిలోని పద్మావతీ యూనివర్సీటీ ఉండేది. విభజన సమయంలో అది ఏపీకి వెళ్లిపోవడంతో తెలంగాణలోనూ మహిళా యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Read Also: రవితేజ “కిలాడి” నుంచి సంక్రాంతి పోస్టర్
ఈ నేపథ్యంలోనే 2018 మార్చిలో రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్(రూసా) కింద కోఠి మహిళా కళాశాలను వర్సిటీగా ఉన్నతీకరించాలని భావించారు. అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కడియం శ్రీహరి ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో చర్చలు జరిపారు.మహిళా యూనివర్సీటీ ఏర్పాటు కోసం రూ. 50 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే రూ.100 కోట్లు వెచ్చిస్తే అన్ని వసతులతో విశ్వవిద్యాలయంగా మార్చవచ్చని 2018లో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు అంచనా వేశారు. తాజాగా మంత్రి కేటీఆర్ ప్రతిపాదనతో ఈ అంశం మరోసారి తెరపై కి వచ్చింది. ఇప్పటికే మూడుసార్లు న్యాక్ గుర్తింపును దక్కించుకుంది కోఠి ఉమెన్స్ కాలేజీ.