Former OSD Sumanth : మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. సుమంత్తో పాటు మరో ముగ్గురికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం.. ఒక్కొక్కరు రూ.25 వేల చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తు బాండ్లు సమర్పించాలని ఆదేశించింది. షూరిటీలను సమర్పించిన అనంతరం ముందస్తు బెయిల్పై విడుదల చేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది.
పోలీసుల ముందు సరెండర్ కావాలి
ముందస్తు బెయిల్ పొందిన నిందితులు పోలీసుల ముందు సరెండర్ కావాలని కోర్టు సూచించింది. కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి అవసరమైనప్పుడు పిలిస్తే తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ఎలాంటి చర్యలకు పాల్పడకూడదని కోర్టు స్పష్టం చేసింది. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సాక్షులను ప్రేరేపించడం, బెదిరించడం చేయకూడదని ఆదేశించింది. సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేయకూడదని పేర్కొంది.
దేశం విడిచి వెళ్లడంపై ఆంక్షలు
కోర్టు ముందస్తు అనుమతి లేకుండా భారతదేశాన్ని విడిచి వెళ్లకూడదని సుమంత్కు న్యాయస్థానం షరతు విధించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు కోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటించాలని సూచించింది. ముందస్తు బెయిల్ పొందిన పిటిషనర్లు తమ మొబైల్ ఫోన్ నంబర్లు, నివాస చిరునామాలను దర్యాప్తు అధికారికి అందించాలని కోర్టు ఆదేశించింది. దర్యాప్తు ప్రక్రియలో పోలీసులు కోరినప్పుడు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది.
మరో ముగ్గురికి కూడా బెయిల్
సుమంత్తో పాటు ఈ కేసులోని మరో ముగ్గురు పిటిషనర్లకు కూడా నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తులు, ష్యూరిటీలను సమర్పించిన తర్వాత బెయిల్పై విడుదల చేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. దీంతో ఈ కేసులో నిందితులకు కోర్టు నుంచి తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది.

