యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు భారీగా కాంగ్రెస్ శ్రేణుల తరలివచ్చారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పాలిట శాపంగా మారాయని ఆయన ఆరోపించారు. రైతు పండించిన పంటను కొనాల్సిన ప్రభుత్వాలే ధర్నాలు చేస్తున్నాయని, యాదాద్రి ఆలయ ప్రారంభానికి నన్ను పిలవలేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ డైరెక్షన్ ప్రకారమే ఆలయ ఉద్ఘాటనకు పిలవలేదని, మౌలిక సదుపాయాలు లేకున్నా ఆలయాన్ని ప్రారంభించారని ఆయన ఆరోపించారు. ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా ఆలయాన్ని ప్రారంభించి భక్తులను ఇబ్బంది పెట్టడం సరికాదని, యాదాద్రిలో ప్రభుత్వం లేనిపోని ఆంక్షలు పెట్టి భక్తులను ఇబ్బంది పెట్టొద్దని ఆయన ‘స్పష్టం చేశారు.
ప్రజల సొమ్ముతో ఆలయాన్ని నిర్మించి టీఆర్ఎస్ లీడర్లకే సొంతమన్నట్లు ప్రజలపై ఆంక్షలు పెట్టొద్దని, ఆలయ నిర్మాణంలో వంద లోపాలు ఉన్నాయని, వెంటనే ఆటోలను కొండపైకి అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు. యాదాద్రికి 22 సార్లు వచ్చిన సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టలో ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లయినా కట్టించారా.?అని ఆయన ప్రశ్నించారు. ఆలయ ప్రారంభాన్ని తూతూ మంత్రంగా చేయడంతో గుట్టలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలిందని, భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తానని చెప్పి ఎనిమిదేళ్లవుతున్నా నయా పైస ఇయ్యలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక భద్రాచలం ఆలయాన్ని సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని, రూ.200 కోట్లతో భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. యాదాద్రి అభివృద్ధిలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, గతంలో ఆనంద్ సాయి ఏ టెంపుల్ కు ఆర్కిటెక్చర్ గా పనిచేయలేదని, ఆలేరు నియోజకవర్గ రైతులను ఆదుకోవాలన్నారు.