బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రైతుల నోట్లో మట్టికొట్టాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల దుష్ట రాజకీయ పన్నాగాలకు రైతులు బలవుతున్నారని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు. అసలే వర్షాలు లేక రైతులు తీవ్రమైన బాధలో ఉంటే.. కనీస మానవత్వం లేకుండా స్వార్ధరాజకీయాల కోసం రైతుల నోటికాడ బుక్కను లాక్కోవడం ఏంటని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజనాలో రూపాయి లేకుండా ఆగంచేసిపోతే.. తాము రైతుల కోసం రూపాయి రూపాయి కూడబెట్టి.. రైతుభరోసా (రైతుబంధు) వేస్తే.. బీజేపీ కుటిల రాజకీయాలు చేసి అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రైతు భరోసా ను రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సమయానికి రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేసింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన సమయం కంటే ముందుగా నిన్ననే ఒకేసారి రైతు ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా ఆదేశాలు ఇచ్చారు. రైతులంతా తమ అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయని సంతోషపడే లోపలే.. ఎన్నికల కమిషన్ (ఈసీ) ని అస్త్రంగా చేసుకొని బీజేపీ రైతుల ఖాతాలో పడ్డ నిధులను ఆపేలా కుట్రలు చేయడం బాధాకరం. బీజేపీకి మొదటి నుంచీ అన్నదాతలు అంటే అక్కసు, ఆగ్రహం.. అందుకే నల్ల చట్టాలు తెచ్చి రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేసింది.. ఈ నల్ల చటాలకు వ్యతిరేకంగా పోరాడిన వందలాది రైతులను పొట్టన పెట్టుకుంది.
ఇప్పుడు బీజేపీ తన గుప్పిట్లో ఉన్న ఈసీ ని అడ్డం పెట్టుకొని బ్యాంక్ ఖాతాలో పడ్డ రైతుభరోసా సొమ్ములను కూడా నిలిపి వేసింది. ఇంత కంటే దారుణం ఎక్కడా ఉండదు.. బీజేపీ చేస్తున్న కుట్రలను అన్నదాతలు అర్థం చేసుకున్నారని ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. గతంలో.. 2018 ఎన్నికల సమయంలో ఎన్నికల రోజునే కేసీఆర్ రైతు బంధు డబ్బులు వేశారు.. అప్పుడు అడ్డుచెప్పని ఈసీ ఇప్పుడు ఎందుకు ఆపింది..? ఆనాడు కేంద్రంలోనూ ఇదే బీజేపీ ఉంది. మరి అప్పుడు ఎందుకు ఆపించలేదు..? బీఆర్ఎస్-బీజేపీ కలిసి ఆడుతున్న నాటాకాలని ప్రజలు ఇప్పటికే గుర్తించారు. రెండు పార్టీలకు రైతులే తగిన గుణపాఠం చెప్తారు. రైతు భరోసా కొత్త పథకం కాదు.. గత కొన్ని రోజులుగా క్రమంగా డబ్బులు వేస్తున్నాం. పెండింగ్ ఉన్న డబ్బులు ఇప్పుడు వేశాం. రాజకీయాలకు అతీతంగా గత ఎన్నికల సమయంలో రైతులకు రైతుబంధు డబ్బులు ముందుగానే నిధులు జమ చెయ్యమని అప్పటి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీనే కోరింది.. ఆ విధంగా రైతుల ప్రయోజనాల కోసం కృషి చేసామని చెప్పిన ఆయన… ఇలా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఓట్ల కోసం రైతులను బలిపెట్టడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రలో రైతు భరోసా నిధులు ఆపిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని రైతులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.