Kishan Reddy: పాటిగడ్డ కాలనీలో సుమారు 15 ఏండ్ల కిందట కట్టిన ఇండ్లు పేదలకు ఇంతవరకు ఇవ్వలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగంపేట్, ఓల్డ్ పాటిగడ్డ బస్తిలో కిషన్ రెడ్డి పర్యటించారు. సమస్యల పరిష్కారం కోసం బస్తీ బాట పట్టారు. బస్తీల్లో సమస్యలపై ఆరా తీస్తూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రజలతో బాధ్యతాయుతంగా మెదులుతూ.. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 30 శాతం పైగా జనాభా హైదరాబాద్ లో ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంతో పాటు అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దామని కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ ప్రచారం చేసుకున్నారని అన్నారు. కేవలం ధనవంతులు ఉన్నచోటే.. హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో ఎకనామిక్ సిటీ పేరుతో ఫ్లైఓవర్స్ కట్టి రంగులుపూసి ప్రచారం చేసుకొని గత ఎన్నికల్లో ఓట్లు పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెయిన్ రోడ్లు దిగి బస్తీల్లో పర్యటించాలని కేటీఆర్ కి గతంలో పదేపదే గుర్తుచేశామన్నారు. అయినా ఏనాడు కూడా వారు బస్తీలను పట్టించుకోలేదని మండిపడ్డారు.
Read also: Indigo Ayodhya Flight: అయోధ్యకు కొత్త విమాన సర్వీసును ప్రారంభించిన ఇండిగో.. ఛార్జీ ఎంతంటే ?
పేద ప్రజలు నివసించే బస్తీలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో రోడ్లు, వీధిలైట్లు లేక, డ్రైనేజీ సమస్యలతో పాటు కనీస సదుపాయాలకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మహిళలకు స్కిల్ డెవలప్ సెంటర్లు లేవు.. ప్రభుత్వ పాఠశాలలు పాత భవనాలతో పూర్తిగా నిరుపయోగంగా తయారయ్యాయని అన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ బాటలోనే నడుస్తుండటం సరికాదన్నారు. పాటిగడ్డ కాలనీలో సుమారు 15 ఏండ్ల కిందట కట్టిన ఇండ్లు పేదలకు ఇంతవరకు ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో గతంలో పేదల కోసం నిర్మించిన ఇండ్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి అలాట్ మెంట్ చేయాలన్నారు. ఇప్పటికీ చాలా బస్తీల్లో విద్యుత్ కనెక్షన్లకు నోచుకోని దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదలపై చిత్తశుద్ధి ఉంటే పేద ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు.
Kadiyam Srihari: పొంగులేటి అలా, భట్టి సతీమణి ఇలా.. కడియం సంచలన వ్యాఖ్యలు..